Sunday, May 06, 2012

మేడే - తక్షణ కర్తవ్యం

మేడే - తక్షణ కర్తవ్యం
 
ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో జరుపుకునే దీక్షా దినం -- మే డే. ఇది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే డే నాడు అన్ని దేశాల కార్మికులు తాము చేసిన పోరాటాలను సమీక్షించుకొని, మున్ముందు చేపట్టవలసిన పోరాటాలు, సాధించవలసిన డిమాండ్లకై ప్రతినబూనుతారు. ఈరోజు తమ తమ పనులను బంద్ చేసి, ఊరేగింపులూ సభలు నిర్వహించి, ప్రపంచ కార్మికులారా ఏకంకండని నినదిస్తారు. తమ సమైఖ్యతను చాటి చెబుతారు. తరతరాలుగా ప్రపంచ కార్మిక వర్గం చేసిన పోరాటాలకు, పోరాడి సాధించుకున్న హక్కులకూ ప్రతీక మేడే.
యూరప్ లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తరువాత , పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దాంతో సమాజంలో పెట్టుబడి దారులు, కార్మికులనబడే రెండు కొత్త వర్గాలు పుట్టుకొచ్చాయి. పెట్టుబడిదారులు పరిశ్రమలకు పెట్టుబడి పెట్టి, కార్మికుల శ్రమ శక్తిని దోచుకుంటూ, తమ సంపదను ఎన్నో రెట్లు పెంచు కుంటూ పోయారు. మరో వైపు కార్మికులు, ఏ ఆస్తి లేక, తమ రెక్కల కష్టంతో సంపదను సృష్టిస్తూ, ఘోరమైన దోపిడీకి గురవుతూ వచ్చారు. ఎలాంటి వసతులు లేని యమకుపాల్లాంటి ఫ్యాక్టరీలలో రోజుకు 14 గంటల నుండి 18 గంటల వరకు చాకిరి చేస్తూ, చాలీ చాలని జీతాలతో, మురికివాడల్లో అనారోగ్య పరిస్థితుల్లో కొట్టు మిట్టాడేవారు. ఆ రోజుల్లో వారికి ఎలాంటి హక్కులూ లేవు. పరిమిత మైన పనిగంటలు లేవు. ఎక్కువ పనిచేసిన గంటలకు జీత భత్యాలు లేవు. ఫ్యాక్టరీలలో రక్షణ లేదు. ఆరోగ్య బీమాలు, వైద్య సదుపాయాలూ లేవు. ఎన్ని సంవత్సరములు పని చేసినా ప్రావిడెంటు ఫండు, గ్రాట్యుటీ లాంటి సదుపాయాలు లేవు. ప్రమాదాలు జరిగితే నష్ట పరిహారాలు లేవు. కనీసంగా మనుషులకు ఉండాల్సిన హక్కులు, సదుపాయాలూ ఏ మాత్రం లేవు. పేదలకు ఓటు హక్కు కూడా లేదు. ఎప్పుడో తెల్లవారక ముందే పనికిపోయి, అర్థ రాత్రి తిరిగొచ్చే తమ తండ్రులు ఎలావుంటారో కూడా పిల్లలకు తెలియదు.
అలాంటి ఘోరమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా, తర తరాలుగా కార్మిక వర్గం పోరాడి ఎన్నో హక్కులను, సదుపాయాలను సాధించుకున్నది. 8 గంటలు పని, 8 గంటలు వినోదం, 8 గంటలు విశ్రాంతి సాధించే దిశగా ఎన్నో పోరాటాలు చేశారు. 8 గంటల పని దినం కోసం జరుగుతున్న పోరాటాల పరంపర లో భాగంగా 1886 లో మే 1 వ తారీఖున అమెరికా లోని చికాగో నగరం లోని కార్మికులు సార్వత్రిక సమ్మె చేసి, హేమార్కెట్ వద్ద పెద్ద ప్రదర్శన జరిపారు. కార్మికుల పోరాటాలను అణచి వేయాలని, పోలీసులు విచ్చల విడిగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఎందరో కార్మికులు గాయ పడ్డారు, చని పోయారు. తమ శరీరాల నుండి కారుతున్న రక్తంలో తడచిన చొక్కాలనే జెండాలుగా ఎగరేసి, కార్మిక వర్గ జెండా - ఎర్ర జెండాను సృష్టించారు. ఆ తరువాత చికాగో నగరం లోను, ఇతర నగరాల్లోనూ, ఇతర దేశాల్లోనూ కార్మికులు పోరాటాలు కొనసాగించారు.
ఫ్రెంచి విప్లవ 100 వ వార్షి కోత్సవం సందర్భంగా 1889 లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ మొదటి మహా సభ చికాగో ప్రదర్శనల వార్షి కోత్సవం సందర్భంగా 1890 మే 1 న అంతర్జాతీయ ప్రదర్శనలు జరపాలని నిర్ణ యించింది. 1891 లో జరిగిన 2 వ మహాసభ ప్రతి సంవత్సరం ప్రదర్శనలు జరపాలని నిర్ణయించింది. 1894 లో మేడే ప్రదర్శనల పై దాడులు జరిగాయి. 1904 లో ఆమ్ స్టర్ డాం లో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ మేడే సందర్బంగా కార్మికులు పని బంద్ చేసి, అన్ని దేశాలలో ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చింది.
ఆ విధంగా మేడే స్పూర్తి తో వివిధ దేశాలలో తర తరాలుగా కార్మిక వర్గం పోరాడి ఎన్నో హక్కులను, డిమాండ్లను సాధించుకుంది. 8 గంటల పని దినాన్ని సాధించుకుంది. ట్రేడ్ యూనియన్లు పెట్టుకునే హక్కునూ సాధించుకుంది. ఓటు హక్కునూ సాధించుకుంది. కార్మిక రాజ్య బీమానూ, ప్రావి డెంటు ఫండును. గ్రాట్యుటీ, బోనస్, ప్రమాదాలు జరిగితే నష్ట పరిహారం, సకాలంలో జీతాలు చెల్లించాలని చట్టాలూ, అదనంగా పని చేసిన గంటలకు రెట్టింపు జీతం, పండుగ శలవలు, లీవులు, కనీస వేతనాలు, ఆసుపత్రి సదుపాయాలూ ఇలా ఎన్నో సాధించింది.
కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఈ మద్యనే భగ్గు మన్న యానాం లోని రెజెంసి సిరామిక్స్ కార్మికుల పోరాట కారణాలని పరిశీలిద్దాం. 28 ఏళ్ల క్రితం ఫాక్టరీ పెట్టినప్పటి నుండి పని చేస్తున్న కార్మికులు చాలా మంది ఇప్పటికీ పర్మనెంటు కాలేదు. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికుల జీతాలు ఆరు, ఏడు వేల రూపాయలే. వాళ్లకు చట్ట ప్రకారం ఇవ్వవలసిన సదుపాయాలూ ఎమీ లేవు. యూనియన్ పెట్టుకునే హక్కును కూడా యాజమాన్యం కాల రాస్తుంది. కనీస వేతనాలు, బోనస్, మరియే చట్ట బద్దమైన సదుపాయాలూ లేవు. కానీ ఈ 28 ఏళ్ళలో యాజమాన్యం ఉత్పత్తి 11 రెట్లు పెంచింది. తమిళ నాడులో ఇంకొక ఫాక్టరీ పెట్టింది. అంతర్జాతీయంగా పేరు పొంది, ఎగుమతులు చేస్తుంది. వేరే దేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టబోతుంది. ఖాయిలా పడిన వేరే కంపనీలు కొని, దీనిలో కలిపింది. పాకింగ్ కు కావలసిన అట్టల కంపెనీ పెట్టింది. పెద్ద ట్రాన్స్ పోర్ట్ కంపెనీ పెట్టింది. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర కాలేజీలు, స్కూళ్ళు పెట్టింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, కోర్టులను తన గుప్పిట్లో పెట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యానాం ను పరిపాలిస్తుంది.
కార్మికులు పర్మనెంటు చేయమంటే చేయనంది. యూనియన్ పెట్టుకుంటే పనిలో నుంచి తీసి వేసింది. లాకౌట్లకు పాల్పడింది. అరెస్టులు చేయించింది. ఎదిరించిన కార్మిక నాయకుడ్ని పోలీసులతో కొట్టించి చంపించింది. కార్మికులపై కాల్పులు చేయించింది. దాంతో కార్మికుల సహనం కట్టలు తెంచుకుంది. కార్మికుల, వారికి మద్దతు నిచ్చిన ప్రజల కోపాగ్నికి ఫాక్టరీ ఫర్నిచర్ భగ్గుమంది. ఫాక్టరీ యాజమాన్యానికి ఇన్సురెన్స్ డబ్బులు వస్తాయి. దాని పై ఆధార పడ్డ దాదాపు ఆరు వేల కార్మికుల భవిష్యత్తు అంధకార బంధురంగా తయారయింది. ఎక్కడో జార్ఖండ్ లోనో, బీహార్లోనో, ఛత్తిస్ గడ్ లోనో మాఫియా కోరలకు బలవుతున్న కార్మికులు కారు వీరు. మన పక్కనే ఉన్న యానంలో జరుగుతున్న ఘాతుకం ఇది. ఆ రాష్ట్రాల్లో నైతే శంకర గుహ నియోగి, సునీల్ పాల్ లాంటి కార్మిక నాయకుల్ని చంపుతుంటారు. కార్మికులు మనుష్యుల్లాగా బతికే అవకాశం కూడా లేదు. ఈ మద్య చట్ట ప్రకారం సమాచార హక్కు కోసం పని చేసే కార్యకర్తలను కూడా పొట్టన పెట్టుకుంటున్నారు.
దేశంలో ఎక్కడా కార్మిక చట్టాలు అమలు జరగడం లేదు. తర తరాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని, సదుపాయాలను కాల రాస్తున్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రులకు కూడా, ఏ నైపుణ్యము లేని కార్మికులకు ఇవ్వవలసిన కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వ కంపెనీల లోనే గొడ్డు చాకిరి చేయించు కుంటున్నారు. ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగాలు లేవు. ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళ నయినా సంవత్సరాల తరబడి కాంట్రాక్టు కార్మికులుగా పని చేయించు కుంటున్నారు. ఇక మామూలు కార్మికుల పరిస్థితి చెప్పా నలవి కాదు. విదేశీ, సాఫ్ట్ వేర్ కంపెనీలలో పని దొరికిన వారికి కొంత జీతం ఎక్కువ యిస్తున్నా, రాత్రిం బగళ్ళు కష్టపడాల్సి వస్తుంది. భార్యా భర్తలు ఇద్దరూ అలా కష్టపడుతూ, తిండి కూడా బయటే తింటూ, నిద్ర కూడా సరిపోక బాధ పడుతున్నారు. వారి షిఫ్టులు వేరయితే వారు ఒకరి నొకరు చూసుకోవడం కూడా కనాకష్టమే. పని భారంతో బిపి, షుగర్, గుండె జబ్బుల పాలవుతున్నారు. సంతాన లేమి ప్రబలంగా ఉంది. సంసారాలు విచ్చిన్న మౌతున్నాయి.
ఇక మహిళా కార్మికుల స్థితి గతులు చెప్పనలవి కాదు. వారు రెండితలు దోపిడీ దౌర్జన్యాలకు గురవు తున్నారు. బీడీ కార్మికులు, ఇతర అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులు కడు దీనమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేక,ఆరోగ్యం క్షీణించి నరక యాతనలు పడు తున్నారు. చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసుల్లో పని చేసే మహిళలు కూడా లైంగిక వేధింపులకు గురవటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమాజంలో స్త్రీకి ఇంట్లో గాని, బయట గాని రక్షణ అన్నదే లేకుండా పోయింది.
ఆర్థిక సంక్షోభం పెరిగే కొద్ది కార్మికులా, మామూలు ప్రజలా ఆర్థిక స్థితి గతులు క్షీణిస్తూ ఉన్నాయి. 1980 దశకం మొదట్లో బొంబాయి నూలు మిల్లుల కార్మికుల పోరాటం తరువాత, ఒక్క సింగరేణి లో తప్ప, ఎక్కడా కార్మికులు పోరాడే పరిస్తితులు లేకుండా పోయాయి. వేలాది పరిశ్రమలు ఖాయిలా పడటం, చిన్న మద్య తరగతి ఫ్యాక్టరీల మనుగడే కష్టతరం అయిన పరిస్థితుల్లో, కార్మిక వర్గం పూర్తిగా యాజమాన్యాల దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి బతకవలసి వస్తుంది. ప్రభుత్వ రంగంలో కూడా జీత భత్యాల పెరుగుదల ప్రభుత్వం చేసినపుడే అవుతుంది. ఎన్నో సంవత్సరములు ఆలస్యం చేసి, ఎన్నికల జీత భత్యాలు పెంచుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఒప్పందాల కాల పరిమితి కూడా 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచారు. ఇప్పుడది పది సంవత్సరాలయింది. గత సంవత్సరం జీత భత్యాలను పెంచిన వెంటనే బియ్యం, పప్పులు, మొదలైన నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపు అయ్యాయి. పెరిగిన జీతాల ఫలితం ఒక్క సంవత్సరం కూడా అనుభవించలేదు. మరి మిగతా 9 సంవత్సరాలు ఎలా బతకాలన్నది పెద్ద ప్రశ్నార్థకం. ప్రైవేటు రంగంలో, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కైతే,ఆ మాత్రం జీతాల పెంపు కూడా లేకుండా, ధరలతో పాటు పెరిగే కరువు భత్యం లేకుండా ఎలా బతుక గలుగుతారో ఊహించడం కూడా కష్టం.
1990 ల తరువాత సామ్రాజ్యవాదం ప్రపంచ ప్రజలపై ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ లను సంధించింది. చిన్న చేపలను పెద్ద చేప మింగినట్లు, చిన్న చిన్న పరిశ్రమలను జాతీయ పరిశ్రమలను విదేశీ కంపనీలు మింగేసాయి.బ్యాంకులు,ఇన్సురెన్సు, టెలికాం, మందులు చివరికి సరుకులు చిల్లరగా (రిటైల్) అమ్మే షాపులు కూడా శత కోటీశ్వరుల, విదేశీ కంపెనీల కబంధ హస్తాలలో చిక్కు కున్నాయి. శత కోటీశ్వరుల కంపెనీలలో కూడా విదేశీ కంపెనీల వాటా గణనీయంగా పెరిగింది. టోకు వ్యాపారం చేస్తామంటూ వచ్చి భూములను కాజేసిన 'మెట్రో' చిల్లర వ్యాపారం చేస్తుంది. ధరలూ ఎక్కువగానే ఉన్నాయి. గ్రామాల్లో చేతి వృత్తులు చితికి పోయాయి. ప్రపంచీకరణ భూతం మూడవ ప్రపంచ దేశాలను పూర్తిగా కబళిస్తుంది.
జపాను నుంచి అత్యంత తక్కువ వడ్డీకు తెచ్చిన డబ్బును, ఇతర దేశాలలో గుప్పించి కృత్రిమంగా రియల్ ఎస్టేట్ పొంగును సృష్టించారు. ఆ పొంగు ఒక్క సారిగా క్రుంగి పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోబం ఇప్పుడు తాండవిస్తుంది. భూమి చాలా పరిమితమైన ముఖ్య వనరు అని ఇప్పుడు గుర్తించిన విదేశీ కంపెనీలు, శత కోటీశ్వరులు సెజ్ ల పేరుమీద లక్షల ఎకరాలను కబళిస్తున్నారు. రైతులను పంట పొలాల నుంచి వెళ్ళగొట్టి, జాలర్లను సముద్రానికి దూరం చేసి, వారి పొట్టలు కొట్టి, పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారు. దేశంలో ఉన్న సహజ ఖనిజ సంపదను ఈ ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. అది వారు దోచుకు పోటానికి వీలుగా, ఆదివాసులను అడవి నుంచి తరిమి కొట్టడానికి సైన్యాన్ని దింపింది. అమాయక ఆదివాసులపై విపరీతమైన దౌర్జన్యాలనూ చేస్తూ, వారిని చంపుతూ రేప్ లు చేస్తూ భారత భూమి పై కరాళ నృత్యం చేస్తున్నాయి.
ఈ సహజ సంపదంతా ప్రజలది. దానిపై ప్రభుత్వాలకు ఏమి హక్కు లేదు. ఈ సంపదను పరి రక్షించి రాబోయే తరాలకు అందించవలసిన బాధ్యత ఈ తరానిది. కమీషన్లకు కక్కుర్తి పడి ఈ సంపదను ప్రైవేటు పరం చేయటం దారుణం. ఆ హక్కు ప్రభుత్వాలకు లేదు. కాబట్టి దాన్ని ఎదిరించాల్సిన బాధ్యత ప్రజలందరిదీ.
ఈ దోపిడీ బ్రిటీషు వారి వలస పాలనలోని దోపిడిని మించి పోయింది. ఆనాటి స్వాతంత్ర పోరాటాన్ని మించి పోరాడాల్సిన అవసరాన్ని మనందరమూ గుర్తించాలి. ఆ నాడు బ్రిటీషు వాడి తొత్తు గా కాంగ్రెస్ పార్టీ పని జేస్తూ, ప్రజల తరుపున పోరాడుతున్న ఏకైక పార్టీగా ఫోజు పెట్టింది. బ్రిటీషు వాళ్ళు మన కాదే చెప్పారు. ఈ రోజు అలాంటి పార్టీలు మనకు అవసరం లేదు. అల్లూరి సీతా రామ రాజు, చంద్ర శేఖర ఆజాద్, భగత్ సింగ్, చండ్ర పుల్లారెడ్డి లాంటి పోరాట యోధుల స్పూర్తితో తెగించి పోరాడుదాం.  దేశాన్ని స్మశానంగా మార్చాలని చూస్తున్న సామ్రాజ్యవాదుల, బడా పెట్టుబడి దారుల, బడా భూస్వాముల కూటమికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా తిరగబడి, ఈ దేశాన్ని ఈ దేశ సంపందను రక్షించు కుందాం. దీనికై నడుం బిగించి పెద్ద ఎత్తున కదులుదాం, రండి!! ఇదే ఈ మేడే కు మన తక్షణ కర్తవ్యం!!!
* ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎదిరిద్దాం!
* దేశ సహజ సంపదను ప్రైవేటు పరం చేయటాన్ని ఎదిరిద్దాం!
* అమర వీరులకు జోహార్లు!
* మేడే వర్థిల్లాలి!

Share/Bookmark

Tuesday, April 17, 2012

శివసాగర్ తో నేను:



శివ సాగర్ ను ఒక కవిగా నేను అభిమానిస్తాను. ఆయన బహిరంగంగా ఉన్నప్పుడు ఆయన స్పీచ్ లు విన్నాను గాని, ఆయనతో ఎక్కువసేపు గడిపే అవకాశం అనుకోకుండా ఒక రోజు వచ్చింది. 1990 జనవరిలో హైదరాబాదు రాణాప్రతాప్ ఫంక్షన్ హాలులో విరసం 20 సంవత్సరాల సభలు (10 వ మహాసభలు) జరుగుతున్నాయి. అకస్మాత్తుగా ఒక రాత్రి శివసాగర్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చాలా కొద్ది మందిమి ఆయన చుట్టూ చేరాము. అప్పుడు తూర్పు యూరప్ దేశాల పతనం పై నేను రాసి, ఆ విషయం పై బాలగోపాల్ స్పీచ్ కు ముందు నేను పాడిన పాట "మార్కిజం అజేయం" ఆయనకు పాడి వినిపించాను. (ఆ పాట చివరి చరణం - మళ్ళి విప్లవాల అక్టోబర్ వస్తుంది - తూర్పు గాలి గ్లోబు చుట్టేసి వస్తుంది - లోని మళ్ళి విప్లవాల అక్టోబర్ వస్తుంది ని శీర్షికగా పెట్టి బాలగోపాల్ ఉదయం పేపరులో తరువాత వ్యాసం రాసారు). అంత ముఖ్య పరిణామంపై ఎవరూ స్పందించటం లేదు మీరు ఒక కవిత రాయండి అని అడిగాను. ఒక స్టాండర్డ్ చేరిన తరువాత దాన్ని నిలుపు కుంటునే రాయాలి, అదే కష్టం అన్నారు (తరువాత రాసారు).
ఆ రాత్రి చాలా సేపు సాహిత్యం గురించి చర్చించుకున్నాం. తరువాత మీరు పడుకోండి, నన్ను అరెస్టు చేయటానికి పోలీసులు వస్తారేమో, ఇక్కడ మిగతా వారికి డిస్టర్బ్ జరుగ కూడదన్నారు. అయినా రాత్రంతా చర్చిస్తూ కూర్చున్నాం. తెల్లారింది. పోలీసులు రాలేదు, ఆయన బహిరంగం అయిపోయారు.
తరువాత మరో విరసం మహా సభల్లో ఆయన పాల్గొన్నారు. 1994 జనవరి రాజమండ్రి విరసం మహా సభల్లో ఆయన తీసుకున్న దళిత లైనును విమర్శిస్తూ నేను మాట్లాడాను. తరువాత ఇంకా చాలా మార్పులు వచ్చాయి.
ఒక విప్లవ కారుడుగా ఆయన ఓడించ బడినా, ఒక కవిగా ఆయన చిరస్మరణీయుడు.

Share/Bookmark

Monday, April 04, 2011

కమ్యూనిస్టులు వేర్పాటువాద ఉద్యమాలను బలపరుస్తారా?

కమ్యూనిస్టులు వేర్పాటువాద ఉద్యమాలను బలపర్చటంలో వైరుధ్యం లేదనటం సరికాదు. మన్యసీమ, ఉత్తర కోస్తా, రాయలసీమ, పల్నాడు-ప్రకాశంలూ వెనుకబడ్డ ప్రాంతాలేనని ఒప్పుకుంటూ, ఒక్క తెలంగాణా కోసమే పోరాడటం ఏ విధంగా సరైనది? వారే పోరాడటం లేదనో, లేక వారు పోరాడితే బలపరుస్తామనటం అవకాశవాదమే. గొంతు లేనివారికి గొంతు యివ్వాల్సిన వారు ఇలా తప్పించుకోవటం సరికాదు. కమ్యూనిస్టుల మొదటి పిలుపు 'ప్రపంచ కార్మికులారా, ఏకంకండి' ని మరచిపోరాదు. భాధితులనందరిని ఏకం చేసి పోరాడటం కమ్యూనిస్టుల ప్రథమ లక్షణం. పైన పేర్కొన్న వెనుకబడ్డ ప్రాంతాలు పోతే, మిగిలింది ఉభయ గోదావరులు, కృష్ణ, గుంటూరు జిల్లాలు మాత్రమే. ఈ నాలుగు జిల్లాలలో కూడా పడమటి ప్రాంతాలు వెనుకబడినవే. ఇక మిగిలింది కృష్ణ-గోదావరి డెల్టాలు మాత్రమే. (కాళోజి కవితాత్మకంగా రెండున్నర జిల్లాలు అనివుండచ్చు). విడిపోవటమే పరిష్కారమైతే, మిగతా అందరూ కలిసుండి, కృష్ణ-గోదావరి డెల్టాలనే విడగొట్టచ్చు కదా? వివక్ష వున్నది కాబట్టి విడిపోవాలంటే, వివక్షతకు గురవుతున్న స్త్రీలు, SC లూ, ST లూ, మైనారిటీలు మొదలైన వారు ఏ విధంగా విడిపోగాలుగుతారు?


ఆలస్యంగా తయారైన సామ్రాజ్యవాదులు ప్రపంచ యుద్దాలు తెచ్చినట్లు, ఆలస్యంగా తయారైన తెలంగాణా పెట్టుబడిదారులు ఈ వేర్పాటువాద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. 1969 లో కన్నా ఇప్పుడు విస్తృతంగా వున్నా మీడియాను ఉపయోగించుకొని వేర్పాటు వాదాన్ని ఊరూరా ఇంటింటికీ తీసుకెళ్ళి, దాన్ని ప్రజల ఆకాంక్షగా చిత్రీకరించారు. ఎంతగా రెచ్చ గొడుతున్నారంటే వేరే రాష్ట్రం కాదు, వేరే దేశమే కోరవచ్చంనంతగా. ఇంకో పక్క ఇప్పటికే వేళ్ళునుకున్న పెట్టుబడిదారులు సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చారు. ఈ రెండింటితో ప్రజలకు సంబంధం లేదు. ఇది మార్కెట్ కోసం పెట్టుబడిదారుల పోరాటం. ఇది వివరించి చెప్పాల్సిన బాధ్యత కమ్యూనిస్టులది.


టాటా, బిర్లా, అంబాని లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన పెద్ద పెట్టుబడిదారులను వదిలేసినా, GMR , GVK , రెడ్డిలాబ్స్ అంజిరెడ్డి, అపోలో ప్రతాప్ రెడ్డి, లగడపాటి, రామోజీ, మేటాస్ రాజు లాంటి కోస్తా పెద్ద పెట్టుబడిదారులే పాలక వర్గాలు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వచ్చినా, ముఖ్య మంత్రి మారతాడు కానీ, పాలక వర్గాలు మాత్రం వీళ్ళే. వ్యవస్థలో మార్పు లేకుండా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాదనీ, తమ పోరాటం కొనసాగించాల్సిందే నని ప్రజలకు చెప్పటానికి కమ్యూనిస్టులు భయపడరు. ప్రత్యేక తెలంగాణా వస్తే వీరంతా పోతారని, పెద్ద మార్పు వస్తుందని, ప్రజల సమస్యలు తీరుతాయని చెప్పటం ప్రజలను మోసం చేయటమే. ప్రత్యేక తెలంగాణా వచ్చినా ఈ అసమానతలు కొనసాగుతాయి. 'ఇట్లవునని ఎవరనుకున్నారు' అని కాళోజి అన్నట్లు కమ్యూనిస్టులు అనలేరు. కాళోజి ఎంతో ఇష్టంతో నమోదు చేసిన 'మేమింకా ముందుకు పోతాం' అనేది ముందు గానే చెప్పాలి. వనరులన్నీ ప్రైవేటుపరం అవుతున్న ఈరోజుల్లో ప్రత్యేక తెలంగాణాతో వనరులు ప్రజల పరం అవుతాయని నమ్మబలకటం వంచనే.


కోస్తా, రాయలసీమల గురించి చెప్పేటప్పుడు అక్కడి పాలక వర్గాల గురించి చెబుతారు. తెలంగాణా గురించి చెప్పేటప్పుడు ఇక్కడి ప్రజల గురించి చెబుతారు. తెలంగాణా పాలక వర్గాల స్వభావం అక్కడి పాలక వర్గాల స్వభావం కంటే వేరుగా ఉంటుందా? కొద్దిగా వెనుకా ముందు తేడా మాత్రమే. అంతా ఒకటే వర్గం, ఒకటే స్వభావం అని తేల్చి చెప్పాలి. వారికి ఏజెంట్లుగా మారితే చెప్పలేరు. 

 ఇండియా,పాకిస్తాన్ ల విభజన వల్ల ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. ఎంతో కష్టనష్టాలు అనుభవించారు. పాలక వర్గాలకు మాత్రం విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రజలను పక్క దారులు పట్టించటానికి ఉపయోగపడింది. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో కూడా ఎక్కడా విడిపోవటం లేదు. రష్యా, చైనాల్లో మెజారిటీ జాతి చేతుల్లో వందల సంవత్సరాలు అణచివేతకు గురైనా విప్లవం తరువాత విడిపోయే హక్కు ఉన్నా, విడిపోలేదు కలసివున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ పునరుద్దరణ తరువాతే సోవియెట్ ముక్కలయింది. అంతెందుకు అమెరికాలో రాష్ట్రాలకు విడిపోయే హక్కు వున్నా కలసి ఉంటున్నాయి. రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీని విడదీసినా, అవకాశం రాగానే కలసి పోయాయి. అసలు విడిపోమ్మంటమే నెగటివ్ భావన. అందుకే విడిపోయి కలిసుందామనే తీయటి మాటలు చెబుతున్నారు. 'జై బోలో తెలంగాణా' సినిమాలో కూడా నెగెటివ్ భావనను అధిగమించటానికే కోస్తా అమ్మాయి ఐక్యతనే పాజిటివ్ అంశాన్ని చేర్చారు. దాంట్లో అంతా కేసిఆర్ పంథానే. అయినా హీరోను చంపేస్తుంటారు. కానీ కేసిఆర్ కు మాత్రం ఏమీ కాదు. తెలంగాణా వస్తే ప్రజల సమస్యలన్నీ పరిష్కార మౌతాయని అంబేద్కర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారు. అది వేరే అంశం అనుకోండి.


ఆత్మ హత్యలు విప్లవ పోరాటాల్లో ఉండవు. పాలక వర్గాలు రెచ్చగొట్టి తెచ్చే కుల,మత, భాషా, ప్రాంతీయ, వేర్పాటు వాద ఉద్యమాల్లోనే కనిస్తాయి. 1980 కు ముందే కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి చెప్పినట్లు పాలక వర్గాల దగ్గర ప్రజలను మభ్య పెట్టే బిస్కట్లు అన్నీ అయిపోయాయి, అందుకనే కుల,మత, భాషా, ప్రాంతీయ, వేర్పాటు వాదాలని రెచ్చగొట్టి, ప్రజలను విభజించ మొదలు పెట్టాయి. ఇప్పుడు దేశమంతా (ఉత్తర కోస్తాలో కూడా) సెజ్ లకు వ్యతిరేకంగా, వనరులను ప్రైవేటు పరం చేయటానికి వ్యతిరేకంగా, ప్రజల జీవన్మరణ సమస్యల పై పోరాడుతుంటే, తెలంగాణా లో మాత్రం అస్తిత్వ పోరాటాల పేరు మీద ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టిస్తున్నారు. అస్తిత్వ సమస్యలు లేవని కాదు. వాటిపై పోరాడుతూనే - అసలైన పరిష్కారం విప్లవంలోనే ఉన్నదని చెబుతూ, పోరాటాల్ని అటువైపు మళ్ళించే ప్రయత్నాలు వీళ్ళు చేయటం లేదు. రాజ్యం కూడా విగ్రహాల ధ్వంసాన్ని ప్రోత్సహిస్తూ, రెండు వైపులా ఉన్మాదాన్ని రెచ్చ గొడుతూ, అసలు సమస్యల నుండి ప్రజలందరినీ ప్రక్క దారి పట్టించాలని చూస్తున్నది. ఇప్పుడు దారి తెలంగాణా చూపిస్తున్నదా లేక శ్రీకాకుళం చూపిస్తున్నదా? ఈసారి శ్రీకాకుళమే చూపిస్తున్నది. వరవరరావు గారి నుంచి కరుడు కట్టిన వేర్పాటు వాదులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. దానికి ఈరోజు 'ఆంధ్ర జ్యోతి' లో వచ్చిన ఆయన వ్యాసం 'ప్రజాస్వామిక ఉద్యమం - ధృక్పధాల  సమస్య'   చాలా ఉపకరిస్తుంది. కానీ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ మార్గాన్ని కా.చండ్ర పుల్లారెడ్డి ఎప్పుడో చూపించాడు.

4.4.2011







Share/Bookmark

Tuesday, September 28, 2010

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

దాదాపు గత సంవత్సరకాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. ఉద్యమ స్థాయిలో లేకపోయినా, ప్రత్యేక రాయలసీమ, ఉత్తర కోస్తా, మన్య ప్రదేశ్ లాంటి నినాదాలూ ముందుకొచ్చాయి. గత 40 సంవత్సరాలుగా కమ్యూనిస్టులుగా  చెప్పుకునే వారెవరూ, ఒక్క పార్టీ తప్ప, ప్రత్యేకవాద ఉద్యమాలను బలపరచలేదు. ఈమద్య కొన్ని పార్టీలు తమ వైఖరి మార్చుకొని సమర్థిస్తున్నాయి.

Share/Bookmark

Friday, December 25, 2009

కరపత్రం

కోస్తా, రాయలసీమలకు చెందిన శతకోటీశ్వరుల దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుదాం!

తరతరాలుగా తెలంగాణా ప్రజలం దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నాం. 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కూడా దోపిడీ, వివక్షతలకు గురవుతూనే ఉన్నాం. వెనకబాటుతనంలో మగ్గుతూనే ఉన్నాం. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణాకు, కోస్తా-రాయలసీమలకు చెందిన పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. దానిని అప్పుడే తుంగలో తొక్కారు. ఒప్పందంలోని ఏ ఒక్క అంశాన్ని అమలుచేయలేదు. కోస్తా-రాయలసీమ శతకోటీశ్వరుల దోపిడీకి అప్పుడే పునాది పడింది. ఆ తర్వాత తెలంగాణాకు అనుకూలంగా వచ్చిన ఏ చట్టా లనూ, పథకాలను, జీవోలనూ (610  జీవోతో సహా) అమలు చేయలేదు. నదీజలాలలో తెలంగాణాకు రావలసిన వాటాను కూడా తన్నుకుపోయారు.

ప్రాజెక్టులు తెలంగాణాలో, మునిగిపోయేది తెలంగాణా పల్లెలు, కానీ నీళ్ళు మాత్రం కోస్తాకు. రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్టులు కూడా ఈ కోవకు చెందినవే. ఈ ప్రాజెక్టుల నీళ్ళను కనీసం కోస్తా-సీమ రైతుల పంట పొలాలకు కూడా అందించటం లేదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు(సెజ్ లు) కు మాత్రమే ఇవ్వాలనే కుట్ర జరుగుతున్నది.

హైదరాబాదు చుట్టూ విస్తారంగా ఉన్న భూములు కోస్తా-సీమలకు చెందిన శతకోటీశ్వరుల హస్తగతం అయ్యాయి. తెలంగాణా ప్రజలను మోసం చేసి, చాలా చవుకగా ఈ భూములను కబ్జా చేసారు. వేల ఎకరాల భూములను ఆక్రమించారు. తెలంగాణా పల్లెలను నేలమట్టం చేశారు. ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండళ్ళ(సెజ్ ల) పేరు మీద వందల, వేల ఎకరాలను శత కోటీశ్వరులకు అప్పగిస్తున్నారు. ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టినా వందల, వేల ఎకరాల భూమి అవసరం లేదు. సెజ్ లకు ఇచ్చిన భూముల్లో వాళ్ళు వందలో నలభైయ్యో వంతు ఫ్యాక్టరీలకు వాడుకుంటే చాలు. మిగిలిన అరవై వంతులు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. సెజ్ లలో భారత దేశ చట్టాలు ఏమీ వర్తించవు. కార్మిక చట్టాలు ఏమీ అమలు చేయకుండా, కార్మికులను పూర్తిగా దోపిడీ చేసుకోవచ్చు. కొట్టినా, తిట్టినా, చంపినా, రేప్ లు చేసినా వాళ్లకు ఎదురులేదు. ఏ చట్టాలూ వర్తించవు.


కృష్ణా, గోదావరి నదులు తెలంగాణాలో పారుతున్నా మన భూములు ఎదారులుగానే మిగిలిపోతున్నాయి. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు ఈ అరవై ఏళ్లలో కనీసం మంచినీరు కూడా అందించలేదు.సింగరేణిలో ఓపెన్ కాస్టుల రూపంలో తెలంగాణా పల్లెలను శ్మశానాలుగా మారుస్తున్నారు. అటవీ భూముల్లోని లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలను త్రవ్వుకుపోవటానికి విదేశీ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చారు. దీనికై అడవులను కాళీ చేయించాలి. అందుకై అడవులలో ఉండే ఆదివాసులపై దాడులు జరుగుతున్నాయి. త్రీవ్రవాదుల పేరు మీద కాల్చివేస్తూ, ఆదివాసి మహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు చేస్తూ, దేశంలోని సహజ వనరులను విదేశీపాలు చేయటానికి పూనుకున్నారు. ఇంకోపక్క ఈ శతకోటీశ్వరులు మైనింగ్ పేరుమీద దేశ వనరులను దోచుకుంటూ వేల కోట్లు సంపాదించుకుంటున్నారు.

ఈ భూములు ప్రజలవి. ఈ సహజ వనరులు ప్రజలవి. వీటిని ప్రైవేటు పరం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా, ఈ విచక్షణకు వ్యతిరేకంగా, తెలంగాణా ప్రజలు ఉద్యమించాలి. ఇన్నాళ్ళూ కొందరు రాజకీయ నాయకులు పదవుల కోసం తెలంగాణా నినాదంతో ముందుకువస్తే, ఉద్యమాలు వచ్చాయి. వారికి పదవులు దక్కగానే ఉద్యమాన్ని నట్టేట ముంచారు. ఈ మోసం ఇంకా ఏమాత్రం కొనసాగకూడదు. ఇప్పుడు ఉద్యమాన్ని తెలంగాణా ప్రజలం మన చేతుల్లోకి తీసుకుందాం. కొమరం భీమ్,  దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క ల పోరాట వారసత్వం మనది. దొరల తెలంగాణా కోసం కాదు, ప్రజల తెలంగాణా కోసం మనం పోరాటాన్ని కొనసాగిద్దాం.

కోస్తా-సీమ దొరల పాలన పోయి, తెలంగాణా దొరల పాలన వచ్చినా, తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. ఎందుకంటే మైటాస్ రాజు (సత్యం), జి ఎం ఆర్, జి వి కే, రెడ్డి లాబ్స్ అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి, అపోలో ప్రతాప రెడ్డి, పాతూరి రామా రావు లాంటి ఎందరో కోస్తా-సీమ లకు చెందిన శత కోటీశ్వరులు ఉన్నంత కాలం, ప్రభుత్వంలో ఎవరూ ఉన్నా వారికి అనుగుణంగానే నడుచుకోవలసి ఉంటుంది. వారిని తరిమికొట్టినప్పుడే  ప్రజా తెలంగాణా సాధ్యం.

మన పోరాటం కోస్తా-సీమలకు చెందిన శతకోటీశ్వరులకు వ్యతిరేకంగానే. ఆ ప్రాంతాలనుంచి వచ్చిన మామూలు ప్రజలకు వ్యతిరేకంగా కాదు. వాళ్ళు తమ వ్యతిరేక ధోరణులను మానుకొని, ప్రజా తెలంగాణా కోసం మనం చేసే పోరాటాలలో మనతో కలిసి రావాలని కోరుతున్నాం. రేపటి తెలంగాణా రాష్టంలో కలసిఉండవలసిన ప్రజలం మనం. ప్రజా తెలంగాణాకై కలసి పోరాడుదాం.

మహిళల్లారా!
మనం తెలంగాణా ప్రజలుగా దోపిడీ, అణచివేతలకు గురవటమేకాకుండా, స్త్రీలుగా మరింత అణచివేతలకు గురవుతున్నాం. ఐదు సంవత్సరాల పిల్ల నుండి అరవై సంవత్సరాల తల్లి దాకా ఈ సమాజంలో ఎన్నో రకాలుగా బాధలకు గురవుతున్నాం. ఐదేళ్ళ చిన్న పిల్లను వదిలి తల్లి పనికి వెళ్ళాలన్నా ఈ సమాజంలో భద్రత లేదు. ఇలా బ్రతికేకన్నా, మహిళలం కలసికట్టుగా మార్పుకోసం పోరాటాలను ముందుకు తీసుకుపోదాం. తరతరాలుగా సాగుతున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా మహిళలు నడుంకట్టి పోరాడాలి. తెలంగాణా సాధన పోరాటంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది. పోరాటాలలో మనం ముందుండి మార్గదర్శకుల మవుదాం. మనం పోరాడటమే కాకుండా, ఒక భార్యగా భర్తనూ, ఒక తల్లిగా పిల్లలనూ, ఒక అక్కగా తమ్ముళ్ళను, ఒక చెల్లెగా అన్నలనూ ప్రోత్సహించి పోరాటాల్లోకి తీసుకొద్దాం!

- తెలంగాణా ప్రగతి మహిళా సంఘం
Share/Bookmark

Wednesday, December 16, 2009

తెలంగాణా పరిస్థితి నిజంగా ప్రత్యేకమా?

తెలంగాణా పరిస్థితి నిజంగా ప్రత్యేకమా?  
నేను రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆచరణకు దూరంగా ఉన్నా, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆమె నిలబెడుతున్నారని అనుకుంటూ వుంటాను. కాని 15 -12 -2009 ఆంధ్రజ్యోతిలో వచ్చిన  ఆమె వ్యాసం "తెలంగాణది ప్రత్యేక పరిస్థితి"  చూసి చాలా నిరుత్సాహపడ్డాను. ఆమె చరిత్రను ఇంకా లోతుగా పరిశీలించవలసింది. తన వర్గదృక్పధానికి   మరింత పదును పెట్టవలసింది.

జాతుల చరిత్రను పరిశీలించాలంటే యూరప్ (ఐరోపా) జాతుల చరిత్రను పరిశీలించవలసిందే. ఏ జాతి చరిత్రను చూసినా, అవి వివిధ దశలలో వేరువేరు రాజుల రాజ్యాల కింద చీలిపోయివున్నవే. యూరప్ లో   చివరికి జాతుల వారీ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. బిస్మార్క్ లాంటి వారి కృషితో జర్మన్ జాతి అంతా ఒక దేశంగా ఏర్పడినా, 1945లో  రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండుగా చీల్చబడింది. అయినా 1989లో తూర్పు యూరప్ దేశాలు కూలిన తరువాత, అవకాశం వచ్చిన వెంటనే ఒక్కటయ్యింది.

1917లో మహత్తర అక్టోబర్ విప్లవం విజయవంతం అయిన తరువాత సోవియట్ యూనియన్ ఏర్పడింది. వందల సంవత్సరాలుగా రష్యన్ జాతి ఆధిపత్యంలో నలిగిన ఇతర జాతులు, స్వయం నిర్ణయాధికారం ఉన్నా విడిపోకుండా కలసి వున్నాయి. 1948లో చైనా విప్లవం తరువాతా ఇదే జరిగింది. ప్రపంచ చరిత్ర కలసి ఉంటే కలదు సుఖం అంటుంది. 1990లో సోవియట్ యునియన్ కూలిపోయి, ముక్కలవటాన్ని పాజిటివ్ గా తీసుకోలేం.

మన  రాష్ట్రంలో కూడా, 1969లో జై తెలంగాణా 1972లో జై ఆంధ్రా ఉద్యమాలను కమ్యూనిస్టులని చెప్పుకునే వారు ఎవరూ సమర్థించ లేదు (ఒక్క పార్టీ తప్ప). ఇప్పుడు అందరూ జనరంజక నినాదాలకు పాల్పడు తున్నారు.


ప్రత్యేక తెలంగాణా రాష్టం వచ్చినా, కెసిఆర్ ముఖ్యమంత్రి అయినా కోస్తాకు చెందిన శత కోటీశ్వరులే నిజమైన పాలకులుగా కొనసాగుతారు. రామలింగ రాజు (సత్యం పోయినా మేటాస్ ఉంది), GMR , GVK , అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి లాంటి శత కోటీశ్వరులే శాసిస్తారు. వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.


ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ముఖ్య కారణంగా చెప్పేవి 1 . విచక్షణ , 2 . వనరులు 3 . ఒప్పందాలను అమలు చేయకపోవటం.

విచక్షణ: విచక్షణ నిజమే. కాని స్త్రీలు, వెనకబడిన కులాలు, మైనారిటీలు కూడా దీనికి గురవుతున్నారు. వారు ఏవిధంగా విడిపోగాలుగుతారు? దేనికైనా పోరాటమే ఏకైక మార్గం.

వనరులు: సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్న తరుణంలో, ప్రజలకు ఒనకూడుతాయనుకోవటం కూడా భ్రమే. కొత్త ప్రాజెక్టుల నీళ్లన్నీ రైతుల కోసంకాదు, ఫ్యాక్టరీలకోసమే అన్నది స్పష్టం. వేల ఎకరాల భూమి సెజ్ల పేరుమీద గుంజుకుంటున్నారు. ఆదివాసులను వెళ్ళగొట్టి ఖనిజాలను త్రవ్వుకు పోటానికి విదేశీయులకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు వీటికి వ్యతిరేకంగా పోరాడటం చాలా అవసరం.

ఒప్పందాలను అమలు చేయకపోవటం: ఇది కూడా చాలా ఘోరమైనది. వాటి అమలుకు పోరాడాల్సిందే. కానీ వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.

రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలు కూడా వెనుకపడినవే. ఈ సమస్యలు వారూ ఎదుర్కుంటున్నారు. కృష్ణ, గుంటూరు, రెండు గోదావరి జిల్లాలలో కూడా పడమటి వైపున్న ప్రాంతాలు వెనుకపడినవే. (వాళ్ళనూ పడమటి వాళ్ళంటూ చులకనగా చూస్తారు). విభజించుకుంటూ పోతే దానికి అంతమేక్కడిది?

ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమైతే, ఇన్ని రాష్ట్రాలుగా విడిపోయే బదులు -- కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాలకే ప్రత్యేక రాష్రం ఇస్తే సమస్య పరిష్కారమౌతుంది. కాని గుర్తుంచుకావాల్సింది ఏమిటంటే -- పాలకులనే తోలుబొమ్మలను మార్చాలని, కోస్తా బొమ్మల బదులు తెలంగాణా బొమ్మలను పెట్టుకున్నా, అసలు ఆడించే కోస్తా శత కోటీశ్వరులను మార్చకుండా ఎలాంటి మార్పు రాదు.

ఈ విషయాలు తెలిసిన వారు కూడా వీటిని కప్పిపుచ్చి, జన రంజక నినాదాలతో కొట్టుకుపోతున్నారు. ప్రాంతాల మద్య అసమానతలు ఈ వ్యవస్థలో సహజం. వ్యవస్థ మారనిదే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందవు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లు అలాగే ఉంటాయి.

విడిపోటాలు, కలవటాలు, ఒప్పందాలూ ప్రజల ఇష్టాయిస్టాలతో సంబంధం లేకుండా బూర్జువా నాయకులు చేసినవి. ఒక ప్రాంతం వాళ్ళు చేసారు వారికే హక్కులున్నాయి, వేరే ప్రాంతం వాళ్ళు చేయలేదు అందుకని వాళ్లకు హక్కు లేదు అనటం సబబా?
తెలంగాణాని నిలబెట్టుకోటానికి చెప్పిన రెండు మార్గాలలో మొదటిది సాధ్యం కాదు. రెండవది బూర్జువా నాయకులు చేస్తారా? వారు ఇంకా ఎక్కువ దోచుకోవాలనే చూస్తారు.
చాలా మంది లగడపాటి లాంటి వాళ్ళు తమ ఆస్తులను కాపాడు కోటానికే ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. పదవుల్లో ఉన్నవారు మంత్రులే, అసలు రాజులు వాళ్ళే అనేది మరచి పోతున్నారు.

ఈ వ్యాసంలో ఎన్నికల పట్ల భ్రమలు కూడా కన్పిస్తాయి. ఈ వ్యవస్థలో ప్రజలను చైతన్య పరచినా ఎన్నికల్లో గెలవలేరు.
వ్యాసం రెండో సగంలో నిరాహార దీక్షల గురించి, హైదరాబాద్ గురించి సరిగ్గా చెప్పారు. కానీ, ఒక 'విప్లవ' పార్టీ నాయకుడు హరీష్ రావును కేసీ ఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని పిలుపు ఇచ్చినట్లు, బూర్జువా పార్టీలకు సలహాలు ఇవ్వటం వృధా ప్రయాసే.

 

Share/Bookmark

Friday, December 11, 2009

సమైక్యత ముసుగులో ప్రాంతీయవాదం!

 నేడు బూర్జువా నాయకులు తమ ప్రభావంలో ఉన్నప్రాంతం వరకు విడిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగయితే ఆ ప్రాంతానికి తామే రాజులు కావచ్చని కలలు  కంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ వరకు పట్టు ఉన్న నాయకులకు ప్రత్యేక గ్రేటర్ హైదరాబాద్ కావాలి. తెలంగాణ వరకు పట్టు ఉన్న నాయకులకు ప్రత్యేక తెలంగాణ కావలి. ఆంధ్రప్రదేశ్ వరకు పట్టు ఉన్న నాయకులకు 'సమైక్యాంద్ర '  కావాలి.

ఆంధ్ర ప్రదేశ్ మొత్తం పట్టు ఉన్న వాళ్ళు రాష్ట్రం విడిపోటానికి ఒప్పుకోరు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత ఒకవేళ ఆదిలాబాద్ వాళ్ళో లేక మహబూబ్ నగర్ వాళ్ళో విడిపోతామంటే, ఇప్పటి తెలంగాణ వేర్పాటు వాదులు అప్పుడు సమైక్య వాదులవుతారు. ప్రత్యేక హైదరాబాద్ నిస్తూ పాత MCH పరిధుల వరకే ఇస్తామంటే, గ్రేటర్ హైదరాబాద్ వేర్పాటు వాదులు అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సమైక్య వాదులవుతారు.
  
అందరూ ప్రాంతీయ వాదులే. తమ అవసరాలకు అనుగుణంగా సమైక్య వాదులుగా పోజు పెట్టాల్సి వస్తుంది. 

(హిందూ మతోన్మాదులు కూడా కులోన్మాదం వద్దంటారు. అన్ని కులాలు ఐక్యంగా ఉండాలి, మతం విషయంలో మాత్రం ఐక్యత వద్దంటారు.)
  
Share/Bookmark

Wednesday, December 09, 2009

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు !

కల్వకుంట చంద్రశేఖర రావు (కెసిఆర్) ముఖ్య మంత్రి  అయినా కోస్తాకు చెందిన శత కోటీశ్వరులే  నిజమైన పాలకులుగా కొనసాగుతారు. రామలింగ రాజు (సత్యం పోయినా మేటాస్ ఉంది), GMR , GVK , అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి లాంటి శత కోటీశ్వరులే శాసిస్తారు. వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.


Share/Bookmark

Monday, November 16, 2009

TODAY WHO NEEDS LALGARHs MOST?

today who needs Lalgarhs the most?

the people? or the so called maoists? or the government?

in order to extract vast mineral deposits in the forests of central india, the government needs to vacate millions of tribals from forests. it needs militarisation. for that the lalgarhs come in handy to the government -- as excuses.
Share/Bookmark

నేడు లాల్ గడ్ ఎవరికి ఎక్కువ అవసరం?

ఈ రోజు లాల్ గడ్ లు ఎవరికి ఎక్కువ అవసరం? -- ప్రజలకా? మావోఇస్ట్ గా చెప్పుకునే వారికా? లేక ప్రభుత్వానికా?
ఖనిజాలను తవ్వు కోటానికి, ఆదివాసులను తరి మేయ్యాలి. ఆ యుద్ధం చేయటానికి ప్రభుత్వానికి లాల్ గడ్లు ఒక సాకుగా కావాలి


Share/Bookmark

Saturday, August 23, 2008

WANTED BOLSHEVIK

వాంటెడ్ బోల్షెవిక్

మావోయిస్ట్ పేరున్నా....

మెన్షవిక్ గమ్యం -- ఫిబ్రవరే

ఆక్టోబర్ కు నడిపించే

బోల్షెవిక్ కావాలి

నేపాల్ కి నేడు

20.08.2008

(రష్యా లో 1917 ఫిబ్రవరి విప్లవం మెన్షవిక్ ల, అక్టోబర్ విప్లవం బోల్షేవిక్ ల నాయకత్వంలో వచ్చాయి )

Banner may be Maoist
Menshevik leads
unto February

Nepal needs now
a Bolshevik
to reach October

(in Russia 1917 February revolution was led by Menshaviks and October Revolution was led by Bolsheviks )
Share/Bookmark

Wednesday, August 20, 2008

PRACHANDA MANDELA

ప్రచండ మండేలా

ప్రచండావతరం పూర్తయింది


త్రిజుడు పుష్ప కమా...ల్ కు

పట్టాభిషేకంతో పునర్జన్మ ....

ఇక స్థానం మండేలా పక్కనా

లేక అలెండీ పక్కనా .....?

అమెరికా మౌనార్థం అంగీకారమే .....

ఇక ప్రచండ మరో మండేలానే .....

2008.08.18





(చిలి దేశంలో 1970 లో అలెండి, ప్రచండ లానే అధికారం చేపట్టాడు. కాని అమెరిక ఉతకోత కోసి, మిలటరీ ప్రభుత్వాన్ని తెచ్చింది. )






role of 'Prachanda' is over

thrice-born Pushpa Kamaaal *

reborn with coronation

Where is his place?

besides Mandela or besides Allende ...?

American silence seems to be a consent

Now, Prachanda is another Mandela

*Strange

(In chile Allende, a communist became president in 1970. But was overthrown in US backed military coup and followed by a brutal massacre)


Share/Bookmark

Sunday, December 09, 2007

Political Exodus

(Political Situation in Andhra Prades Province of India)

As the elections are nearing, different personalities from different backgrounds are entering the political arena. Cine actors, former bureaucrats, established lawyers are in fray.

One common aspect of these and also of those who joined earlier is -- they never distribute or spend the hundreds or thousands of crores they amassed earlier among/for the people. They all talk about the present degenerated system and show a rosy picture of change when they come to power. They concentrate on different sections of the people to come to power.

As com. Chandra Pullareddy visualised in late 1970s, the ruling classes have exhausted all their biscuits for wooing the public. They had to resort to casteism, religionism, regionalism, linguistic chauvinism, secessionist agitations etc. As Com. Chandra Pulla reddy rightly predicted, the political scenario changed from early 1980s.

The media had earlier projected many 'Mr. Cleans' - Ramakrishna Hegde, NT Rama Rao, Rajiv Gandhi, PV Narasimha Rao, Vajpayee etc. Later they all revealed their true colors and got exposed as most corrupt personalities.

The forth coming personalities viz. Chiranjivi, Jayaprakas, S. Ramachandra Rao etc. are no exceptions. They are wooing different sections of the people and coming out with different tactics / slogans. In essence they are choosing a better business i.e. political business to further acquire thousands of crores and for acquiring security to their ill-earned money.

Com. Chandra Pullareddy had long ago characterised the so-called communist parties -- CPI and CPI(M) as bourgeois parties. They left Marxism-Leninism long ago. They are not trying to educate the people. They are trying further to create illusions among the masses over the bourgeois parliamentary system. If people again blindly believe some new personality, they would tie up with him and bag some seats for themselves. They are again and again proving to be part of this system.

Even some so called Marxist-Leninist Parties also exhibit illusions towards bourgeois leaders / parties. We have to wait and see what more is cooking.

People have to reject all these designs, reject this aristocratic rule in the name of democracy and work for a new democracy.
Share/Bookmark