Friday, December 25, 2009

కరపత్రం

కోస్తా, రాయలసీమలకు చెందిన శతకోటీశ్వరుల దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుదాం!

తరతరాలుగా తెలంగాణా ప్రజలం దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నాం. 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కూడా దోపిడీ, వివక్షతలకు గురవుతూనే ఉన్నాం. వెనకబాటుతనంలో మగ్గుతూనే ఉన్నాం. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణాకు, కోస్తా-రాయలసీమలకు చెందిన పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. దానిని అప్పుడే తుంగలో తొక్కారు. ఒప్పందంలోని ఏ ఒక్క అంశాన్ని అమలుచేయలేదు. కోస్తా-రాయలసీమ శతకోటీశ్వరుల దోపిడీకి అప్పుడే పునాది పడింది. ఆ తర్వాత తెలంగాణాకు అనుకూలంగా వచ్చిన ఏ చట్టా లనూ, పథకాలను, జీవోలనూ (610  జీవోతో సహా) అమలు చేయలేదు. నదీజలాలలో తెలంగాణాకు రావలసిన వాటాను కూడా తన్నుకుపోయారు.

ప్రాజెక్టులు తెలంగాణాలో, మునిగిపోయేది తెలంగాణా పల్లెలు, కానీ నీళ్ళు మాత్రం కోస్తాకు. రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్టులు కూడా ఈ కోవకు చెందినవే. ఈ ప్రాజెక్టుల నీళ్ళను కనీసం కోస్తా-సీమ రైతుల పంట పొలాలకు కూడా అందించటం లేదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు(సెజ్ లు) కు మాత్రమే ఇవ్వాలనే కుట్ర జరుగుతున్నది.

హైదరాబాదు చుట్టూ విస్తారంగా ఉన్న భూములు కోస్తా-సీమలకు చెందిన శతకోటీశ్వరుల హస్తగతం అయ్యాయి. తెలంగాణా ప్రజలను మోసం చేసి, చాలా చవుకగా ఈ భూములను కబ్జా చేసారు. వేల ఎకరాల భూములను ఆక్రమించారు. తెలంగాణా పల్లెలను నేలమట్టం చేశారు. ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండళ్ళ(సెజ్ ల) పేరు మీద వందల, వేల ఎకరాలను శత కోటీశ్వరులకు అప్పగిస్తున్నారు. ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టినా వందల, వేల ఎకరాల భూమి అవసరం లేదు. సెజ్ లకు ఇచ్చిన భూముల్లో వాళ్ళు వందలో నలభైయ్యో వంతు ఫ్యాక్టరీలకు వాడుకుంటే చాలు. మిగిలిన అరవై వంతులు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. సెజ్ లలో భారత దేశ చట్టాలు ఏమీ వర్తించవు. కార్మిక చట్టాలు ఏమీ అమలు చేయకుండా, కార్మికులను పూర్తిగా దోపిడీ చేసుకోవచ్చు. కొట్టినా, తిట్టినా, చంపినా, రేప్ లు చేసినా వాళ్లకు ఎదురులేదు. ఏ చట్టాలూ వర్తించవు.


కృష్ణా, గోదావరి నదులు తెలంగాణాలో పారుతున్నా మన భూములు ఎదారులుగానే మిగిలిపోతున్నాయి. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు ఈ అరవై ఏళ్లలో కనీసం మంచినీరు కూడా అందించలేదు.సింగరేణిలో ఓపెన్ కాస్టుల రూపంలో తెలంగాణా పల్లెలను శ్మశానాలుగా మారుస్తున్నారు. అటవీ భూముల్లోని లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలను త్రవ్వుకుపోవటానికి విదేశీ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చారు. దీనికై అడవులను కాళీ చేయించాలి. అందుకై అడవులలో ఉండే ఆదివాసులపై దాడులు జరుగుతున్నాయి. త్రీవ్రవాదుల పేరు మీద కాల్చివేస్తూ, ఆదివాసి మహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు చేస్తూ, దేశంలోని సహజ వనరులను విదేశీపాలు చేయటానికి పూనుకున్నారు. ఇంకోపక్క ఈ శతకోటీశ్వరులు మైనింగ్ పేరుమీద దేశ వనరులను దోచుకుంటూ వేల కోట్లు సంపాదించుకుంటున్నారు.

ఈ భూములు ప్రజలవి. ఈ సహజ వనరులు ప్రజలవి. వీటిని ప్రైవేటు పరం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా, ఈ విచక్షణకు వ్యతిరేకంగా, తెలంగాణా ప్రజలు ఉద్యమించాలి. ఇన్నాళ్ళూ కొందరు రాజకీయ నాయకులు పదవుల కోసం తెలంగాణా నినాదంతో ముందుకువస్తే, ఉద్యమాలు వచ్చాయి. వారికి పదవులు దక్కగానే ఉద్యమాన్ని నట్టేట ముంచారు. ఈ మోసం ఇంకా ఏమాత్రం కొనసాగకూడదు. ఇప్పుడు ఉద్యమాన్ని తెలంగాణా ప్రజలం మన చేతుల్లోకి తీసుకుందాం. కొమరం భీమ్,  దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క ల పోరాట వారసత్వం మనది. దొరల తెలంగాణా కోసం కాదు, ప్రజల తెలంగాణా కోసం మనం పోరాటాన్ని కొనసాగిద్దాం.

కోస్తా-సీమ దొరల పాలన పోయి, తెలంగాణా దొరల పాలన వచ్చినా, తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. ఎందుకంటే మైటాస్ రాజు (సత్యం), జి ఎం ఆర్, జి వి కే, రెడ్డి లాబ్స్ అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి, అపోలో ప్రతాప రెడ్డి, పాతూరి రామా రావు లాంటి ఎందరో కోస్తా-సీమ లకు చెందిన శత కోటీశ్వరులు ఉన్నంత కాలం, ప్రభుత్వంలో ఎవరూ ఉన్నా వారికి అనుగుణంగానే నడుచుకోవలసి ఉంటుంది. వారిని తరిమికొట్టినప్పుడే  ప్రజా తెలంగాణా సాధ్యం.

మన పోరాటం కోస్తా-సీమలకు చెందిన శతకోటీశ్వరులకు వ్యతిరేకంగానే. ఆ ప్రాంతాలనుంచి వచ్చిన మామూలు ప్రజలకు వ్యతిరేకంగా కాదు. వాళ్ళు తమ వ్యతిరేక ధోరణులను మానుకొని, ప్రజా తెలంగాణా కోసం మనం చేసే పోరాటాలలో మనతో కలిసి రావాలని కోరుతున్నాం. రేపటి తెలంగాణా రాష్టంలో కలసిఉండవలసిన ప్రజలం మనం. ప్రజా తెలంగాణాకై కలసి పోరాడుదాం.

మహిళల్లారా!
మనం తెలంగాణా ప్రజలుగా దోపిడీ, అణచివేతలకు గురవటమేకాకుండా, స్త్రీలుగా మరింత అణచివేతలకు గురవుతున్నాం. ఐదు సంవత్సరాల పిల్ల నుండి అరవై సంవత్సరాల తల్లి దాకా ఈ సమాజంలో ఎన్నో రకాలుగా బాధలకు గురవుతున్నాం. ఐదేళ్ళ చిన్న పిల్లను వదిలి తల్లి పనికి వెళ్ళాలన్నా ఈ సమాజంలో భద్రత లేదు. ఇలా బ్రతికేకన్నా, మహిళలం కలసికట్టుగా మార్పుకోసం పోరాటాలను ముందుకు తీసుకుపోదాం. తరతరాలుగా సాగుతున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా మహిళలు నడుంకట్టి పోరాడాలి. తెలంగాణా సాధన పోరాటంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది. పోరాటాలలో మనం ముందుండి మార్గదర్శకుల మవుదాం. మనం పోరాడటమే కాకుండా, ఒక భార్యగా భర్తనూ, ఒక తల్లిగా పిల్లలనూ, ఒక అక్కగా తమ్ముళ్ళను, ఒక చెల్లెగా అన్నలనూ ప్రోత్సహించి పోరాటాల్లోకి తీసుకొద్దాం!

- తెలంగాణా ప్రగతి మహిళా సంఘం
Share/Bookmark

Wednesday, December 16, 2009

తెలంగాణా పరిస్థితి నిజంగా ప్రత్యేకమా?

తెలంగాణా పరిస్థితి నిజంగా ప్రత్యేకమా?  
నేను రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆచరణకు దూరంగా ఉన్నా, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆమె నిలబెడుతున్నారని అనుకుంటూ వుంటాను. కాని 15 -12 -2009 ఆంధ్రజ్యోతిలో వచ్చిన  ఆమె వ్యాసం "తెలంగాణది ప్రత్యేక పరిస్థితి"  చూసి చాలా నిరుత్సాహపడ్డాను. ఆమె చరిత్రను ఇంకా లోతుగా పరిశీలించవలసింది. తన వర్గదృక్పధానికి   మరింత పదును పెట్టవలసింది.

జాతుల చరిత్రను పరిశీలించాలంటే యూరప్ (ఐరోపా) జాతుల చరిత్రను పరిశీలించవలసిందే. ఏ జాతి చరిత్రను చూసినా, అవి వివిధ దశలలో వేరువేరు రాజుల రాజ్యాల కింద చీలిపోయివున్నవే. యూరప్ లో   చివరికి జాతుల వారీ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. బిస్మార్క్ లాంటి వారి కృషితో జర్మన్ జాతి అంతా ఒక దేశంగా ఏర్పడినా, 1945లో  రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండుగా చీల్చబడింది. అయినా 1989లో తూర్పు యూరప్ దేశాలు కూలిన తరువాత, అవకాశం వచ్చిన వెంటనే ఒక్కటయ్యింది.

1917లో మహత్తర అక్టోబర్ విప్లవం విజయవంతం అయిన తరువాత సోవియట్ యూనియన్ ఏర్పడింది. వందల సంవత్సరాలుగా రష్యన్ జాతి ఆధిపత్యంలో నలిగిన ఇతర జాతులు, స్వయం నిర్ణయాధికారం ఉన్నా విడిపోకుండా కలసి వున్నాయి. 1948లో చైనా విప్లవం తరువాతా ఇదే జరిగింది. ప్రపంచ చరిత్ర కలసి ఉంటే కలదు సుఖం అంటుంది. 1990లో సోవియట్ యునియన్ కూలిపోయి, ముక్కలవటాన్ని పాజిటివ్ గా తీసుకోలేం.

మన  రాష్ట్రంలో కూడా, 1969లో జై తెలంగాణా 1972లో జై ఆంధ్రా ఉద్యమాలను కమ్యూనిస్టులని చెప్పుకునే వారు ఎవరూ సమర్థించ లేదు (ఒక్క పార్టీ తప్ప). ఇప్పుడు అందరూ జనరంజక నినాదాలకు పాల్పడు తున్నారు.


ప్రత్యేక తెలంగాణా రాష్టం వచ్చినా, కెసిఆర్ ముఖ్యమంత్రి అయినా కోస్తాకు చెందిన శత కోటీశ్వరులే నిజమైన పాలకులుగా కొనసాగుతారు. రామలింగ రాజు (సత్యం పోయినా మేటాస్ ఉంది), GMR , GVK , అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి లాంటి శత కోటీశ్వరులే శాసిస్తారు. వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.


ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ముఖ్య కారణంగా చెప్పేవి 1 . విచక్షణ , 2 . వనరులు 3 . ఒప్పందాలను అమలు చేయకపోవటం.

విచక్షణ: విచక్షణ నిజమే. కాని స్త్రీలు, వెనకబడిన కులాలు, మైనారిటీలు కూడా దీనికి గురవుతున్నారు. వారు ఏవిధంగా విడిపోగాలుగుతారు? దేనికైనా పోరాటమే ఏకైక మార్గం.

వనరులు: సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్న తరుణంలో, ప్రజలకు ఒనకూడుతాయనుకోవటం కూడా భ్రమే. కొత్త ప్రాజెక్టుల నీళ్లన్నీ రైతుల కోసంకాదు, ఫ్యాక్టరీలకోసమే అన్నది స్పష్టం. వేల ఎకరాల భూమి సెజ్ల పేరుమీద గుంజుకుంటున్నారు. ఆదివాసులను వెళ్ళగొట్టి ఖనిజాలను త్రవ్వుకు పోటానికి విదేశీయులకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు వీటికి వ్యతిరేకంగా పోరాడటం చాలా అవసరం.

ఒప్పందాలను అమలు చేయకపోవటం: ఇది కూడా చాలా ఘోరమైనది. వాటి అమలుకు పోరాడాల్సిందే. కానీ వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.

రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలు కూడా వెనుకపడినవే. ఈ సమస్యలు వారూ ఎదుర్కుంటున్నారు. కృష్ణ, గుంటూరు, రెండు గోదావరి జిల్లాలలో కూడా పడమటి వైపున్న ప్రాంతాలు వెనుకపడినవే. (వాళ్ళనూ పడమటి వాళ్ళంటూ చులకనగా చూస్తారు). విభజించుకుంటూ పోతే దానికి అంతమేక్కడిది?

ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమైతే, ఇన్ని రాష్ట్రాలుగా విడిపోయే బదులు -- కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాలకే ప్రత్యేక రాష్రం ఇస్తే సమస్య పరిష్కారమౌతుంది. కాని గుర్తుంచుకావాల్సింది ఏమిటంటే -- పాలకులనే తోలుబొమ్మలను మార్చాలని, కోస్తా బొమ్మల బదులు తెలంగాణా బొమ్మలను పెట్టుకున్నా, అసలు ఆడించే కోస్తా శత కోటీశ్వరులను మార్చకుండా ఎలాంటి మార్పు రాదు.

ఈ విషయాలు తెలిసిన వారు కూడా వీటిని కప్పిపుచ్చి, జన రంజక నినాదాలతో కొట్టుకుపోతున్నారు. ప్రాంతాల మద్య అసమానతలు ఈ వ్యవస్థలో సహజం. వ్యవస్థ మారనిదే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందవు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లు అలాగే ఉంటాయి.

విడిపోటాలు, కలవటాలు, ఒప్పందాలూ ప్రజల ఇష్టాయిస్టాలతో సంబంధం లేకుండా బూర్జువా నాయకులు చేసినవి. ఒక ప్రాంతం వాళ్ళు చేసారు వారికే హక్కులున్నాయి, వేరే ప్రాంతం వాళ్ళు చేయలేదు అందుకని వాళ్లకు హక్కు లేదు అనటం సబబా?
తెలంగాణాని నిలబెట్టుకోటానికి చెప్పిన రెండు మార్గాలలో మొదటిది సాధ్యం కాదు. రెండవది బూర్జువా నాయకులు చేస్తారా? వారు ఇంకా ఎక్కువ దోచుకోవాలనే చూస్తారు.
చాలా మంది లగడపాటి లాంటి వాళ్ళు తమ ఆస్తులను కాపాడు కోటానికే ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. పదవుల్లో ఉన్నవారు మంత్రులే, అసలు రాజులు వాళ్ళే అనేది మరచి పోతున్నారు.

ఈ వ్యాసంలో ఎన్నికల పట్ల భ్రమలు కూడా కన్పిస్తాయి. ఈ వ్యవస్థలో ప్రజలను చైతన్య పరచినా ఎన్నికల్లో గెలవలేరు.
వ్యాసం రెండో సగంలో నిరాహార దీక్షల గురించి, హైదరాబాద్ గురించి సరిగ్గా చెప్పారు. కానీ, ఒక 'విప్లవ' పార్టీ నాయకుడు హరీష్ రావును కేసీ ఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని పిలుపు ఇచ్చినట్లు, బూర్జువా పార్టీలకు సలహాలు ఇవ్వటం వృధా ప్రయాసే.

 

Share/Bookmark

Friday, December 11, 2009

సమైక్యత ముసుగులో ప్రాంతీయవాదం!

 నేడు బూర్జువా నాయకులు తమ ప్రభావంలో ఉన్నప్రాంతం వరకు విడిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగయితే ఆ ప్రాంతానికి తామే రాజులు కావచ్చని కలలు  కంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ వరకు పట్టు ఉన్న నాయకులకు ప్రత్యేక గ్రేటర్ హైదరాబాద్ కావాలి. తెలంగాణ వరకు పట్టు ఉన్న నాయకులకు ప్రత్యేక తెలంగాణ కావలి. ఆంధ్రప్రదేశ్ వరకు పట్టు ఉన్న నాయకులకు 'సమైక్యాంద్ర '  కావాలి.

ఆంధ్ర ప్రదేశ్ మొత్తం పట్టు ఉన్న వాళ్ళు రాష్ట్రం విడిపోటానికి ఒప్పుకోరు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత ఒకవేళ ఆదిలాబాద్ వాళ్ళో లేక మహబూబ్ నగర్ వాళ్ళో విడిపోతామంటే, ఇప్పటి తెలంగాణ వేర్పాటు వాదులు అప్పుడు సమైక్య వాదులవుతారు. ప్రత్యేక హైదరాబాద్ నిస్తూ పాత MCH పరిధుల వరకే ఇస్తామంటే, గ్రేటర్ హైదరాబాద్ వేర్పాటు వాదులు అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సమైక్య వాదులవుతారు.
  
అందరూ ప్రాంతీయ వాదులే. తమ అవసరాలకు అనుగుణంగా సమైక్య వాదులుగా పోజు పెట్టాల్సి వస్తుంది. 

(హిందూ మతోన్మాదులు కూడా కులోన్మాదం వద్దంటారు. అన్ని కులాలు ఐక్యంగా ఉండాలి, మతం విషయంలో మాత్రం ఐక్యత వద్దంటారు.)
  
Share/Bookmark

Wednesday, December 09, 2009

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు !

కల్వకుంట చంద్రశేఖర రావు (కెసిఆర్) ముఖ్య మంత్రి  అయినా కోస్తాకు చెందిన శత కోటీశ్వరులే  నిజమైన పాలకులుగా కొనసాగుతారు. రామలింగ రాజు (సత్యం పోయినా మేటాస్ ఉంది), GMR , GVK , అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి లాంటి శత కోటీశ్వరులే శాసిస్తారు. వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.


Share/Bookmark