Wednesday, December 09, 2009

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు !

కల్వకుంట చంద్రశేఖర రావు (కెసిఆర్) ముఖ్య మంత్రి  అయినా కోస్తాకు చెందిన శత కోటీశ్వరులే  నిజమైన పాలకులుగా కొనసాగుతారు. రామలింగ రాజు (సత్యం పోయినా మేటాస్ ఉంది), GMR , GVK , అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి లాంటి శత కోటీశ్వరులే శాసిస్తారు. వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.



ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ముఖ్య కారణంగా చెప్పేవి 1 . విచక్షణ , 2 . వనరులు 3 . ఒప్పందాలను అమలు చేయకపోవటం.

విచక్షణ: విచక్షణ నిజమే. కాని స్త్రీలు, వెనకబడిన కులాలు, మైనారిటీలు కూడా దీనికి గురవుతున్నారు. వారు ఏవిధంగా విడిపోగాలుగుతారు? దేనికైనా పోరాటమే ఏకైక మార్గం.

వనరులు: సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్న తరుణంలో, ప్రజలకు ఒనకూడుతాయనుకోవటం కూడా భ్రమే. కొత్త ప్రాజెక్టుల నీళ్లన్నీ రైతుల కోసంకాదు, ఫ్యాక్టరీలకోసమే అన్నది స్పష్టం. వేల ఎకరాల భూమి సెజ్ల పేరుమీద గుంజుకుంటున్నారు. ఆదివాసులను వెళ్ళగొట్టి ఖనిజాలను త్రవ్వుకు పోటానికి విదేశీయులకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు వీటికి వ్యతిరేకంగా పోరాడటం చాలా అవసరం.

ఒప్పందాలను అమలు చేయకపోవటం: ఇది చాలా ఘోరమైనది. వాటి అమలుకు పోరాడాల్సిందే.

వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.

రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలు కూడా వెనుకపడినవే. ఈ సమస్యలు వారూ ఎదుర్కుంటున్నారు. కృష్ణ, గుంటూరు, రెండు గోదావరి జిల్లాలలో కూడా పడమటి వైపున్న ప్రాంతాలు వెనుకపడినవే. (వాళ్ళనూ పడమటి వాళ్ళంటూ చులకనగా చూస్తారు).  విభజించుకుంటూ పోతే దానికి అంతమేక్కడిది?

ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమైతే, ఇన్ని రాష్ట్రాలుగా విడిపోయే బదులు -- కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాలకే ప్రత్యేక రాష్రం ఇస్తే సమస్య పరిష్కారమౌతుంది. కాని గుర్తుంచుకావాల్సింది ఏమిటంటే -- పాలకులనే తోలుబొమ్మలను మార్చాలని, కోస్తా బొమ్మల బదులు తెలంగాణా బొమ్మలను పెట్టుకున్నా, అసలు ఆడించే కోస్తా శత కోటీశ్వరులను మార్చకుండా ఎలాంటి మార్పు రాదు.

ఈ విషయాలు తెలిసిన వారు కూడా వీటిని కప్పిపుచ్చి, జన రంజక నినాదాలతో ముందుకు పోతున్నారు. ప్రజలు వీరి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.

ప్రాంతాల మద్య  అసమానతలు  ఈ వ్యవస్థలో సహజం. వ్యవస్థ మారనిదే అన్ని ప్రాంతాలు
 సమానంగా అభివృద్ధి చెందవు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లు అలాగే ఉంటాయి.


గోరటి వెంకన్న పాటలో ఇండియా పాకిస్తాన్ ప్రస్తావన తెచ్చారు. ఇండియా పాకిస్తాన్ విభజన తరువాత ప్రజలకు ఒరిగిందేమిటి? మత కల్లోలాలు, ఊతకోచలు. అన్నీ వదలి వందల మైళ్ళు తరలిపోయారు. తరువాత  రెండు ప్రభుత్వాలు, ఎదుటి వారిని బూచిగా చూపించి ప్రజలను పక్కదోవ పట్టించటానికి  విభజన ఉపయోగ పడింది. ఆ దేశంలోని సామాన్య ప్రజలకు, ఈ దేశంలోని సామాన్య ప్రజలకూ శత్రుత్వం ఏముంది? పాలక వర్గాలు వారి పబ్బం గడుపు కోటానికి శత్రుత్వం సృస్టిస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

 1917 లో మహత్తర అక్టోబర్ విప్లవం విజయవంతం అయిన తరువాత సోవియట్ యూనియన్ ఏర్పడింది. వందల సంవత్సరాలుగా రష్యన్ జాతి ఆధిపత్యంలో నలిగిన ఇతర జాతులు, స్వయం నిర్ణయాధికారం ఉన్నా విడిపోకుండా కలసి వున్నాయి.   1948 లో చైనా విప్లవం తరువాతా ఇదే జరిగింది.

మన దగ్గర ఇంతకుముందు వేర్పాటువాద ఉద్యమాలు  వచ్చినప్పుడు, కమ్యునిస్టులు గాని, కమ్యునిస్టులుగా చెప్పుకునే వారు గాని ఎవ్వరు సమర్ధించ లేదు. ఇప్పుడు మావోయిస్టులుగా చెప్పుకుంటున్న పార్టీ మాత్రం, ప్రభుత్వ వ్యతిరేక ఏ పోరాటానికైనా మద్దతు ఇస్తామన్నారు. ఇప్పుడు కమ్యునిస్టులుగా చెప్పుకునే ఇంకా కొన్ని పార్టీలు కూడా జనరంజక నినాదాలు చేపట్టాయి.

౩౦  ఏళ్ల క్రిందటే కా.చండ్ర పుల్లారెడ్డి చెప్పారు. పాలక వర్గాల దగ్గర ప్రజలను మభ్య పెట్టె బిస్కెట్లు ఆయిపోయినాయని.   ఇక ప్రజలను కుల, మత, భాష, ప్రాంతీయ, వేర్పాటువాదలతో విభజించి పాలింప చూస్తారని.  కచ్చితంగా అలాగే జరుగు తున్నది.


మనం  చరిత్ర నుండి నేర్చుకోవాలి. 1969  లో, 1972  లో చేసిన మోసమే ఇప్పుడూ జరగవచ్చు. మనం ఎన్నాళ్ళు మోసపోతాం? మనం వెంటనే పోరాడాల్సింది సెజ్ లకు వ్యతిరేకంగా, వనరులను తరలించుకు పోవటానికి వ్యతిరేకంగా. ప్రజలను పోరాటాలలో చైతన్య వంతులను చేస్తూ వ్యవస్థలో మార్పు తెచ్చే దిశలో కదిలించాలి. 

Share/Bookmark

No comments: